హైదరాబాద్ : (ధర్మఘంట ) ట్రూ న్యూస్ హైదరాబాద్ నగరంలో మళ్లీ హైడ్రా యాక్షన్లోకి దిగింది. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి.. భారీ భవనాలు నిర్మించగా.. వాటన్నింటిని భారీ యంత్రాలతో నేలమట్టం చేస్తోంది. రాష్ట్రంలో చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి భరతం పడుతున్నారు. ఇక ఇటీవలె హైడ్రాకు ప్రత్యేకంగా హైదరాబాద్లోని బుద్ధభవన్లోని బీ-బ్లాక్ కేంద్రంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తాజాగా మణికొండలోని నెక్నాంపూర్ చెరువును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే శుక్రవారం మణికొండలోని నెక్నాంపూర్ చెరువును కబ్జా చేసి.. కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన ఆదేశాలతో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి.భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. నెక్నాంపూర్ చెరువు బఫర్జోన్లో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. అయితే నెక్నాంపూర్ వాసులు.. అక్కడి అక్రమ నిర్మాణాల విషయాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకురావడంతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. అందులో కొన్ని అక్రమ నిర్మాణాలుగా తేలడంతో కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.ఇక హైదరాబాద్లో ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. బుద్ధ భవన్లోని బీ-బ్లాక్ కేంద్రంగా ఈ స్టేషన్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్కు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది. ఓఆర్ఆర్లోని పరిధి.. దానికి అనుబంధంగా ఉన్న మున్సిపాలిటీలు కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారులు డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమితులవుతారని వెల్లడించింది. జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏవీ రంగనాథ్ చర్యలు తీసుకుంటున్నారు.
హైడ్రా మళ్ళీ ఉక్కుపాదం