నాటి నినాదం - నేటి అభివృద్ధి


ఆరేండ్ల నా తెలంగాణ ఓ పసి మొగ్గ. దేశ పటంలో ఒక కొత్త రాష్ట్రం. నాటి ఉద్యమ నాయకుడే నేటి తెలంగాణ ప్రభుత్వ అధినేత. బంగారు తెలంగాణ ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వంలో తెలంగాణ నేడు దేశానికే దిక్సూచి. ఏ రంగంలో ఐనా తెలంగాణ ఓ రోల్‌ మోడల్‌. మెట్ట పంటలతో నెట్టుకొచ్చిన భూములు నేడు హరిత సింగారాల మాగాణాలై మెరిసిపోతున్నాయి. పక్షపాతపు కేటాయింపులలో పక్షవాతం వచ్చిన నీటి ప్రాజెక్టులు పాలకుడి పట్టుదలే పసరుమందై కొత్త చైతన్యాన్ని నింపుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ పల్లె - అన్నం పెట్టె తల్లి. పట్నం అంటే బతుకుదెరువుకు భరోసా. వ్యవసాయం పండుగై తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. తెలంగాణ ఏర్పడిన తరువాత వివిధ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది.



కాళేశ్వరం, సీతారామ, పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఆర్‌ఎస్పీ పునర్జీవ పథకం, డిండి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణి చేయడమే లక్ష్యంగా సాగుతున్నది. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశ ఎత్తిపోతల పథకంగా రికార్డు సాధించింది. కాళేశ్వరంతో పాటు వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులపై కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌ సాగర్‌, భక్తరామదాసు, రాలివాగు, గొల్లవాగు, తదితర పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది.



సాగునీటి రంగంలో 'మిషన్‌ కాకతీయ' మరో అధ్బుతం. రాష్ట్రంలోని 45వేల పైచిలుకు చెరువుల పునరుద్ధరణ దీని లక్ష్యం. ఇప్పటికే 27,584 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ చెరువుల ద్వారా 15.06 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ చెరువును చూసినా మత్తల్లు దుంకుతున్నాయి. రాష్ట్రంలోని చెరువులన్నింటిని ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది ప్రభుత్వం. కొత్తగా మూడు వేల తూములను ఏర్పాటు చేస్తున్నది. వివిధ వాగులు వంకల మీద 1300 చెక్‌ డ్యాములు నిర్మాణం చేస్తు న్నది. తద్వారా గ్రామాల్లోని బావులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి.



ఒకనాడు చుక్కనీటి కోసం అంగలార్చిన తెలంగాణలో ఇయ్యాల గంగమ్మ ఉబికి వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆరేండ్ల కాలంలో సమగ్రాభివృద్ధిని సాధించింది. పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. రాష్ర్టానికే మణిహారమైన హైదరాబాద్‌ డైనమిక్‌ సిటీగా అవతరించింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదాయం ఎక్కువగా తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చేది. ఖర్చు మాత్రం ఆంద్ర ప్రాంతంలో ఎక్కువ చేసే వారు. కాని స్వరాష్ట్రంలో మన నిధులు మనకే ఖర్చు చేసుకుంటున్నాం. 'పల్లె ప్రగతి', 'పట్టణ ప్రగతి' కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని మొత్తం 140 మున్సిపాలిటీలకు సంవత్సరానికి 1776 కోట్లు; 12,751 గ్రామపంచాయితీలకు 3696 కోట్లు ఖర్చు చేస్తున్నది మన ప్రభుత్వం.



స్వరాష్ట్రంలో లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ప్రభుత్వం ఆన్‌లైన్‌ పరీక్షల ప్రక్రియను ప్రారంభించి దాదాపు 150 నోటిఫికేషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించి అనవసర ఖర్చును తగ్గించుకుంటూ అభివృద్ధిలో భాగమయ్యే ఉద్యోగాలకు పెద్దపీట వేసింది. ఇందులో టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 40 వేలు, సింగరేణిలో 12,500, విద్యుత్‌ బోర్డ్‌ ద్వారా 7500, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డ్‌ ద్వారా 29 వేలు, పంచాయితీ సెక్రెటరీ 9,350, గురుకులాల్లో 3500, టీఆర్టీ నియామకాల ద్వారా 7892, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం జరిగింది.



సీఎం కేసీఆర్‌ సర్కార్‌ ఏటా 45 వేల కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కరోనా కష్టకాలంలో కూడా ఈ వానాకాలం సీజన్లో మొత్తం 1,45,400 ఎకరాలకు, 57.62 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు బంధు పథకం కింద 7251 కోట్ల రూపాయలను జమ చేసింది.గత ఆరేండ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కోటి 20లక్షల మందికి వివిధ పథకాల ద్వారా లబ్దిపొందారు.



ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా ప్రగతికి ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నది.సమైక్య రాష్ట్రంలో చివరి ఆర్థిక సంవత్సరం 2013-14 పూర్తయ్యే నాటికీ తెలంగాణలో జీఎస్‌డీపీ విలువ 4,51,000 కోట్ల రూపాయలు ఐతే స్వరాష్ట్రంలో రాష్ట్ర సంపద దాదాపు రెట్టింపు అయింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర సంపద విలువ 8,65,688 కోట్లుగా నమోదు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణలో ఖర్చు చేయబడ్డ మూలధన వ్యయం 54,052 కోట్లు. కానీ తెలంగాణలో 2014 నుంచి 2020 వరకు ఖర్చు చేయబడ్డ మూలధన వ్యయం 211800 కోట్లు. మచ్చుకు ఈ లెక్కలు చాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ధృడంగా ఉందో చెప్పకనే చెబుతున్నది.



తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్‌ గారి నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో నూటికి నూరు శాతం పారదర్శకత పెరిగింది. పకడ్బంది ప్రణాళికతో టీఎస్‌పీఎస్‌సీ పని చేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీపీఎస్‌సీ పేరుతో అడ్డదారిలో తెలంగాణ యువత ఉద్యోగాలన్నీ తెరవెనుక అమ్ముడుపోయినయ్‌. ఏపీపీఎస్‌సీ అంటేనే అవినీతి పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ అన్నంతగా పేరు వచ్చింది.



స్వరాష్ట్రంలో లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ప్రభుత్వం ఆన్‌ లైన్‌ పరీక్షల ప్రక్రియను ప్రారంభించి దాదాపు 150 నోటిఫికేషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించి అనవసర ఖర్చును తగ్గించుకుంటూ అభివృద్ధిలో భాగమయ్యే ఉద్యోగాలకు పెద్దపీట వేసింది.



ఇందులో టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 40 వేలు, సింగరేణిలో 12,500, విద్యుత్‌ బోర్డ్‌ ద్వారా 7500, పోలీస్‌ రిక్రూ ట్‌మెంట్‌ బోర్డ్‌ ద్వారా 29 వేలు, పంచాయితీ సెక్రెటరీ 9,350, గురుకులాల్లో 3500, టీఆర్టీ నియామకాల ద్వారా 7892, హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌లో కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం జరిగింది.



రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో 95శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకువచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. కేసీఆర్‌ గారి మార్గనిర్దేశకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ ఐపాస్‌ (సింగిల్‌ విండో ఇండస్ట్రీయల్‌ పాలసీ) ద్వారా అనేక పరిశ్రమల స్థాపనకు అవకాశం ఇస్తూ దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది. తద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 13 లక్షల పై చిలుకు ఉద్యోగాల కల్పన జరిగింది.



ఇదే బాటలో తెలంగాణ ప్రభుత్వం మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మొన్న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేలా, పరిశ్రమలకు అదనంగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. స్థానిక పరిశ్రమల్లో ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా పురోగమన, అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ.