పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి మహేందర్ రెడ్డి


- - జిల్లా ఎస్పీలతో నేర సమీక్ష నిర్వహించిన డిజిపి
- - సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశం
- - కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా పని చేస్తున్న నల్లగొండ ఎస్పీని అభినందించిన డిజిపి


నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు.


బుధవారం (నేడు)  జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక జిల్లాలలో 2001 కేసులు సైతం నేటికి పెండింగులో ఉన్నాయని, అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. కోర్టు కేసులలో శిక్షల శాతం పెరిగేలా, నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన నల్లగొండ, రామగుండం ఎస్పీలను, సైబరాబాద్, రాచకొండ, రామగుండం కమిషనర్లను డిజిపి ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పని చేయాలన్నారు. సైబర్ నేరాల కేసులు పరిష్కారం కోసం అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. లాక్ డౌన్ వల్ల సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరిగిపోయిందన్నారు. పోలీస్ అధికారులు సైబర్ నేరాలను తగ్గించడం కోసం అవసమైన సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ సిబ్బంది సంఖ్యను పెంచుతూ సైబర్ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని డిజిపి మహేందర్ రెడ్డి చెప్పారు.



జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 2001 సంవత్సరం పెండింగులోవి కేసులను సైతం క్లియర్ చేసే విధంగాజిల్లా జడ్జితో సమీక్ష నిర్వహించడం జరిగిందని వివరించారు. నల్లగొండ జిల్లాలో గత సంవత్సరం డిసెంబర్ 31 వరకు 4500 పెండింగ్ కేసులుండగా డిఎస్పీ, సిఐలతో పెండింగ్ కేసులపై ఎప్పటికపుడు సమీక్షించడం ద్వారా 1500 కేసులకు పైగా పరిష్కరించడం ద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను 3000లకు తీసుకురావడం జరిగిందని డిజిపికి వివరించారు. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్యను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రంగనాధ్ వివరించారు.


వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ సి. నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణారెడ్డి,  సిఐలు రవీందర్, సురేష్ బాబు, వెంకటలక్ష్మి, ఆర్.ఐ. నర్సింహా చారి తదితరులున్నారు.