హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవణాల్ని కూల్చివేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ప్రభుత్వం కొత్త భవనం నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం సీ బ్లాక్ ను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు.