హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో మరో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కావాల్సిన సమాచారాన్ని పరిశ్రమల శాఖ ఈ వెబ్ సైట్లో పొందుపరిచింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... సరళతర వాణిజ్య విధానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. పెట్టబడుల ఆకర్షణలో ప్రమోషన్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. వెబ్ సైట్ లో పెట్టుబడి దారులకు అవసరమైన సంపూర్ణ సమాచారం అందించామన్నారు. మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం తరపున ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే వెబ్ సైట్ లో పలు సేవలకు సంబంధించిన లైవ్ లింకులను ఉంచామని, తద్వారా ఆయా సేవలను పెట్టుబడిదారులు నేరుగా వినియోగించుకోవచ్చని చెప్పారు. భవిషత్తులో ఈ వెబ్ సైట్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్ సైట్ ను రూపొందించాల్సిన అవసరముందని చెప్పారు.