ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం పలువురు ముఖ్యమంత్రులకు ఫోన్ కాల్ చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కూడా ఉన్నారు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ప్రధాని స్వయంగా....ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫోన్ చేయడంతో ఆయా రాష్ట్రాల అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
దీంతో దేశంలో మరోసారి లాక్ డౌన్ ఉంటుందా అన్న చర్చ జరిగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ప్రధాని పలువురు సీఎంలకు ఫోన్ చేశారు. వీరిలో తెలంగాణ, తమిళనాడు, బీహార్ అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారు.
తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా తదుపరి కార్యాచరణకు సిద్ధం చేసుకోవాలని మోడీ భావిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు.
కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలను ప్రధాని వాకబు చేసినట్లుగా తెలుస్తోంది.
సోమవారం మరికొందరు సీఎంలతో నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ప్రస్తుతం భారతదేశంలో 10, 86, 476 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 26, 951 మంది మరణించారు.