అందుకే చైనా ఈ కుట్రలు పన్నుతోంది:అమెరికా


వాషింగ్టన్: భారత్ పై చైనా చేస్తున్న కుయుక్తులను అగ్రరాజ్యం అమెరికా ఎండగట్టింది. ప్రపంచమంతా కోవిడ్ పై దృష్టి సారించిందని భావించిన బీజింగ్ ఇలాంటి దుస్సహాసాలకు పాల్పడుతోందని పేర్కొంది. భారత సరిహద్దుల్లో చైనా కుట్రలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం నిశితంగా గమనిస్తోందని విదేశాంగ శాఖ లో ఉన్నతాధికారి డేవిడ్ స్టిల్ వెల్ మరోసారి పునరుద్ఘాటించారు. గతంలో డోక్లాంలోనూ డ్రాగన్ ఇదే తరహా కుయుక్తులను ఒడిగట్టిందని గుర్తుచేశారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న తరుణంలో చైనా ఇదే అదునుగా భావించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశాలతో చైనా దూకుడుగా వ్యవహరించడంపై అమెరికా ఇప్పుడే తమ వైఖరిని ప్రకటించలేదన్నారు.


గతంలోనూ ఇలాంటి సరిహద్దు వివాదాలు తలెత్తాయని స్టిల్ వెల్ గుర్తుచేశారు. తాజాగా చైనాకు చెందిన'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ ఏ)' వివాదాస్పద ప్రాంతంలో చాలా లోపలికి చొచ్చుకువెళ్లిందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా సైన్యాన్ని మోహరించిందని తెలిపారు. అయితే, చైనా ఇలా ఎందుకు  చేసిందన్న దానిపై మాత్రం స్పష్టత లేదన్నారు. తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడం లేదా వ్య్వహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఇలా చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారత్, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, వాణిజ్య ఒప్పందాలు, కరోనా వైరస్ వివరాలు వెల్లడించడం... ఇలా ఏ విషయంలోనూ చైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిండం లేదన్నారు.


చైనా సైన్యంలో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో  అమరులైన  భారత సైనికుల మరణం పట్ల అమెరికా 'సెక్రటరీ ఆఫ్ స్టేట్' మైక్ పాంపియో సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.