ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు


వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ కాలేజీలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేషన్‌ సెరిమనీలో పాల్గొన్న ఒబామా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 75,000 మందికి పైగా అమెరికన్‌ల ప్రాణాలను తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు లేవు.


కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో డొనాల్డ్‌ ట్రంప్‌ దారుణంగా విఫలమయ్యారంటూ ఒబామా మండిపడ్డారు.


ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది తమను తాము ఇన్‌చార్జ్‌లుగా చెప్పుకుంటున్నా వారు చేస్తున్న పనులు వారికే అర్థం కావడంలేదు. అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 23న జార్జియాలో 25ఏళ్ల అహ్మద్‌ ఆర్బెరిని కాల్చి చంపిన ఘటనని గుర్తు చేశారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న సమయంలోనూ.. బయటికి వచ్చిన నల్లజాతీయులను చంపేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.


ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ' ఒబామా విమర్శలు గుప్పించారు. కాగా.. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోవిడ్‌-19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించిన విషయం తెలిసిందే.