కరోనాతో ఆరు నెలల పసికందు మృతి


చండీఘడ్‌: కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు, ఎవరిని పడితే వారిని పొట్టనపెట్టుకుంటూ మృత్యు మృదంగం మోగిస్తోంది. తాజాగా కరోనా బారిన పడ్డ ఆరు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన పంజాబ్‌లోని చండీఘడ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చండీఘడ్‌లోని పగ్వారాకు చెందిన ఆరు నెలల పాప హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెను తొలుత స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించగా అనంతరం లూధియానా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో ఏప్రిల్ తొమ్మిదిన ఆమెను చండీఘడ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్‌)లో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం ఆమెకు కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న క్రమంలో గురువారం మధ్యాహ్నం చిన్నారి కన్నుమూసింది.