హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి ఓ మందు తెప్పించేందుకు ఆతృత పడ్డారు. ఇండియా ఇవ్వనంటే ప్రతీకారం ఉంటుందనే దాకా పోయారు. ఆ మందు పేరు హైడ్రాక్సీక్లోరోక్విన్. అది మలేరియా మందు. దానిని అజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్తో కలిపి వాడితే కరోనా 'కథే మారుతుందని' ట్రంప్ టాంటాం వేశారు. కానీ రోగం కుదరడం మాటేమోగానీ కథ అడ్డం తిరిగింది. అమెరికా అంటువ్యాధుల విభాగం నియమించిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ వాడరాదని సిఫారసు చేసింది. ఔషధ పరీక్షలకు తప్ప మరి దేనికీ దీనిని వాడొద్దని స్పష్టం చేసింది. కారణం - ఈ మందు విపరిణామాలు. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ లేదా మరో క్లోరోక్విన్ వాడకం గురించి ఏమీ చేల్చలేదు.
అనుకూలంగా లేదా వ్యతిరేకంగా చెప్పడానికి తగినంత సమాచారం లేదని కమిటీ పేర్కొన్నది. ఒకవేళ ఆ మందు వేసేటట్టయితే ప్రతికూల ప్రభావాల కోసం పేషంటును పరిశీలించాలని నొక్కిచెప్పింది. ఈ కమిటీని అమెరికా అధ్యక్షుని సలహాదారైన ఆంటోనీ ఫాసీ నియమించారు. కాగా మంగళవారం ప్రచురితమైన ఓ విశ్లేషణ నివేదిక అమెరికా వెటరన్ అఫేర్స్ హాస్పిటల్స్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వడం వల్ల ప్రయోజనాలు లేకపోగా అధిక మరణాలు సంభవించాయని హెచ్చరించడం గమనార్హం. అయితే మరిత లోతైన పరిశోధన జరగాలని ఆ విశ్లేషణలో పాల్గొన్న నిపుణులు, పరిశోధకులు అభిప్రాయపడ్డారు.